Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ఎన్నికల్లో ఓటు వేసేందుకు పల్లె ప్రజలు పోలింగ్ బూత్ లకు వెల్లువెత్తుతుంటే... పట్టణ ప్రజలు మాత్రం పోలింగ్ బూత్ లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కొండా సంగీతారెడ్డి అన్నారు. గ్రామాలలో ఎన్నికలు అంటే ఓ పండుగలా భావిస్తారని, చాలా పెద్ద సంఖ్యలో వచ్చి తమ బాధ్యత గుర్తెరిగి ఓట్లు వేస్తారని, అదే పట్టణాల్లో మాత్రం పోలింగ్ శాతం చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న మైహోం విహంగ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also Read : గంజాయి ట్రాన్సుపోర్టు 'వయా' ఔటర్ రింగురోడ్డు
ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కార అనుగుణంగా, ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతూ, సమర్థులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆ పనులను పర్యవేక్షిస్తూ కంటిమీద కునుకు కూడా లేకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కష్టపడుతున్నారని అన్నారు. పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ఏ రాష్ట్రంలో ఏ అవసరం ఉన్నా సమానంగా అభివృద్ధి చేస్తున్న ఘనత నరేంద్రమోదీ దని అన్నారు. అలాంటి విశాల దృక్పథం ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఎన్నుకోవాలంటే ముందుగా మనందరం వెళ్లి ఓట్లు వేయాలని, అసలు ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ విహంగ కమ్యూనిటీ వాసులు, స్థానికులు పాల్గొన్నారు.
Admin
Ekaburu