Ekaburu - శేరిలింగంపల్లి / హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ వేడికి కారణమైంది. మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో ఈ మధ్యే తెలంగాణ స్పీకర్ క్లిన్ చీట్ ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించిన వారి పేర్లు ఉండడం సంచలనం గా మారింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 28 మందితో గురువారం సాయంత్రం కోఆర్డినేటర్ల జాబితా విడుదల చేసింది. ఇందులో నిజామాబాద్ కార్పొరేషన్ కు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని నియమిస్తూ టీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం అటు తెలంగాణ రాజకీయాల్లో, ఇటు శేరిలింగంపల్లి లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గా గెలుపొందిన అరెకపూడి గాంధీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ స్పీకర్ కు పిర్యాదు చేసింది.
స్పీకర్ నిర్ణయం తీసుకోక పోవడంతో గులాబీ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ మధ్యే నిర్ణయం తీసుకున్నారు. అరెకపూడి గాంధీ పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ ఎమ్మెల్యే గాంధీకి క్లీన్ చీట్ ఇచ్చారు. కాగా తాజాగా గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కోఆర్డినేటర్ల జాబితాలో అరెకపూడి గాంధీ పేరు ఉండడం సంచలనంగా మారింది. తెలంగాణ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా గుర్తించిన అరెకపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల కోఆర్డినేటర్ గా ప్రకటించడం అటు రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు శేరిలింగంపల్లి లో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. దీన్ని ఆధారంగా చూపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు గుప్పించడం తో పాటు గాంధీ అనర్హత కోసం మరోసారి కోర్టును ఆశ్రయిస్తారనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే గాంధీ తో పాటు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లుగా తేల్చిన తెల్లం వెంకట్ రావు, ప్రకాష్ గౌడ్ పేర్లు సైతం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ల జాబితాలో ఉండడం విశేషం.
Admin
Ekaburu