Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న విబేధాలు భగ్గుమన్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల ముందే రెండు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు, చేష్టలతో ముఖ్యమంత్రి ఖంగుతిన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాంధీ మాట్లాడకుండా జగదీశ్వర్ గౌడ్ వర్గీయులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. జగదీశ్వర్ గౌడ్ ఓ వైపు వారిస్తున్నా కార్యకర్తలు వినిపించుకోకుండా ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగలడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. శేరిలింగంపల్లి కాంగ్రెస్ లో వివాదం మరింత ముదరకుండా, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి అప్పజెప్పినట్టు సమాచారం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెండు వర్గాల మధ్య విబేధాలు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల ముందే రచ్చకెక్కడం సంచలనంగా మారింది.
Also Read : టెంటు కింద నేతలు... జోరు వానలో ప్రజలు...
ఈ ఘటనతో శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయినట్టు స్పష్టం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిట్టింగ్ బీఆర్ఎస్ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మరోవైపు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి జగదీశ్వర్ గౌడ్ మీద విజయం సాధించారు. గతంలో ఒకే పార్టీలో కలిసి పని చేసినా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా నిలవడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ గౌడ్ ను శేరిలింగంపల్లి ఇంచార్జి గా నియమించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మారిన రాజకీయ సమీకరణాలతో గతకొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిక పై జగదీశ్వర్ గౌడ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ లో చేరడంతో శేరిలింగంపల్లి కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో శనివారం గోపన్ పల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వర్గపోరుకు వేదికగా మారింది. ఎమ్మెల్యే గాంధీ ప్రసంగించేందుకు లేవగానే జగదీశ్వర్ గౌడ్ వర్గం నినాదాలు చేయడం సంచలనంగా మారింది.
ఓ వైపు జగదీశ్వర్ గౌడ్ వారిస్తున్నా కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో ఎమ్మెల్యే గాంధీ చేసేది లేక రెండు నిమిషాల్లో తన ప్రసంగం ముగించారు. కార్యకర్తల చర్యతో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఖంగుతిన్నారు. ఈ వివాదంపై కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. బహిరంగ వేదిక మీద స్థానిక ఎమ్మెల్యే ను మాట్లాడకుండా సొంత పార్టీ వారే అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని, భవిష్యత్తు లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేదుకు రాష్ట్ర మంత్రికి భాద్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. కాగా కార్యక్రమం అనంతరం సైతం ఇరువర్గాల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు, దూషణలకు దిగడం వివాదాన్ని మరింత పెంచింది.
Admin
Ekaburu