Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో నయా భారత్ ఆవిష్కృతమైందని, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని బిజెపి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాయదుర్గం మైహోం భుజా ఆవరణలో స్థానికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కొండా విశ్వేశ్వరరెడ్డి శనివారం ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నేడు భారతదేశం బిజెపి పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. కొన్నేళ్ల క్రితం డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రవేశపెడితే కొంతమంది విమర్శించారని, నిరక్షరాశ్యులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఈ చర్య విఫలమవుతుందని వాధించారన్నారు. కానీ నేడు దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా, ఏ చిన్న వ్యాపార సముదాయంలోనైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా లావాదేవీలు జరుగడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన దక్షతకు, దూరదృష్టికి ఇది నిదర్శనమన్నారు.
Also Read : ఖాజాగూడ స్కూల్ విద్యార్థులు ఉత్తమంగా రాణించాలి : సాయిబాబా
సంస్కృతి, సాంప్రదాయాలకు మన దేశం పుట్టినిళ్లని, మన వేదపండితులు ఇచ్చే ఆశీర్వాదం మరే దేశంలో ఉండదన్నారు. ధైర్య, స్థైర్య, విజయ అంటూ వేదపండితులు ఆశీర్వదించే పద్ధతిలోనే ఎంతో మహత్తు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి దేశ వ్యాప్తంగా మరోసారి విజయడంఖా మోగించి ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోడీ అధికారం చేపట్టి చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ రానున్న రోజుల్లో ప్రపంచ సూపర్ పవర్ గా ఎదుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ తో పాటు నరసింహరాజు, పవన్, అరవింద్, సంతోష్, ప్రసాద్, మైహోం భుజా కమ్యూనిటీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu