Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : జర్నలిస్టుల సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యూజే - టీజేఎఫ్ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం నేతల అరెస్టు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర అని ఆయన విమర్శించారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జీవో సాకుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడం ద్వారా ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టేందుకు వచ్చిన ఆరు గ్యారంటీ లతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణ పేరుతో ఇచ్చిన ఏడవ గ్యారెంటీ అంటే జర్నలిస్టులను అరెస్టు చేయడమేనా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సింది పోయి, ఉన్న వాటిని తొలగించడం ద్వారా ప్రభుత్వం వారి ఉపాధిని మరియు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను, నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ, అక్రిడేషన్ల పునరుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
అక్రిడేషన్ కార్డుల కుదింపుపై వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన జర్నలిస్టులను అరెస్టు చేయడం హేయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అధికారంలోకి రాకముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, అక్రిడేషన్ కార్డులను పెంచుతామంటూ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 26వేల అక్రిడేషన్ కార్డులను 10 వేలకు కుదించడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులను అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
Admin
Ekaburu