Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వంటి అత్యంత అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు ఇద్దరు యువకులు ప్రయత్నించడం సంచలనంగా మారింది. నగరంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు యువకులు మాస్ కాపీతో అడ్డంగా దొరికిపోయారు. బటన్ స్కానర్లతో ప్రశ్న పత్రాన్ని స్కాన్ చేసి బాత్రూం లోకి వెళ్లి ఏఐ సహాయంతో జవాబులు తెలుసుకొని, చెవిలో ఉన్న బ్లూటూత్ తో వింటూ పరీక్షలు రాయసాగారు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read : గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు గచ్చిబౌలిలోని వర్సిటీ క్యాంపస్ ఆవరణలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షకు హర్యానా రాష్ట్రానికి చెందిన అనీల్(30) సైతం హజరయ్యాడు. కాగా వరీక్ష రాస్తున్న సమయంలో అనీల్ చెవిలో ఉన్న బ్లూటూత్ నుంచి పదేపదే బీప్ సౌండ్ రావడంతో ఇన్విజిలేటర్ తనిఖీ చేశాడు, షర్టుకు ఉన్న స్కానర్ ను, చెవిలో బ్లూటూత్ గుర్తించారు. స్కానర్ తో ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసి తరచూ బాత్ రూమ్ కు వెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో సమాదానాలు తెలుసుకొని చెవిలో ఉన్న బ్లూటూత్ లో వింటూ సమాధానాలు రాస్తున్నట్లు గుర్తించారు. దీంతో అనీల్ ను అదుపులోకి తీసుకున్న వర్సిటీ అధికారులు మిగిలిన విద్యార్థులను మొత్తం తనిఖీ చేశారు. ఇందులో హర్యానాకే చెందిన మరో యువకుడు సతీష్ వద్ద సైతం స్కానర్, బ్లూటూత్ లభించింది. ఇతను సైతం ప్రశ్నా పత్రాన్ని స్కాన్ చేసి ఎఐ సమాధానాలతో జవాబులు రాస్తున్నట్లు వెలుగు చూసింది. దీంతో ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. హెచ్సీయు రిజిస్ట్రార్ దేవేష్ నిఘమ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Admin
Ekaburu