Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించడంతో పాటు సదరు ఇంటికి ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మాణం చేపట్టిన మియాపూర్ కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధికారులకు పిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన మియాపూర్ కార్పొరేటర్ ను తన పదవి నుంచి భర్తరఫ్ చేయడంతో పాటు ప్రభుత్వ భూమిలో భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మంగళవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, శేరిలింగంపల్లి తహశీల్దార్ కు ఆధారాలతో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 44 రికార్డు ల ప్రకారం ప్రభుత్వ భూమి అని, ఈ భూమిలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ భారీగా అధికార దుర్వినియోగానికి, ఉల్లంఘనలకు పాల్పడ్డాడని అన్నారు.
Also Read : జెఎన్టీయూలో ఈనెల 30,31న ఏఐ, మిషన్ లెర్నింగ్ సదస్సు
దొంగదారిలో అధికారులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడంతో పాటు కార్పొరేటర్ పదవిని దుర్వినియోగం చేసి లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మించుకున్నాడని అన్నారు. అధికారులను మభ్యపెట్టి, భయపెట్టి, తప్పుదారి పట్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్న ఇంటికి రహదారి ఏర్పాటు చేసుకున్నాడన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి, ఖర్చు చేసిన నిధులను కార్పొరేటర్, అధికారుల నుంచి వసూలు చేయాలన్నారు. సర్వే నెంబర్ 44పై న్యాయస్థానం లో శాశ్వత నిర్ణయం వచ్చే వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా తగిన అదేశాలు ఇవ్వాలని అధికారులకు పిర్యాదు చేశారు.
Admin
Ekaburu