Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డికి ఓటు వేసి బిజెపి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేట్ డివిజన్ లోని ఓయూ కాలనీ ప్రాంతంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మోసం చేస్తోందన్నారు. యువతకు ఉద్యోగాలు, గృహ నిర్మాణ హామీలు, మహిళలకు భద్రత వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చవిచూసిందని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కేవలం రాజకీయ లాభాల కోసమే నడిచే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పాలని సూచించారు.
Also Read : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అభివృద్ధి చెందిన కాలనీల కంటే నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బస్తీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఈ బస్తీలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నా, పారదర్శక పాలన కొనసాగాలన్నా, ప్రజా సంక్షేమం మరింత వేగంగా జరగాలన్నా.. తప్పకుండా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భారత్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉందని, జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో బిజెపిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్ రాందీన్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, నరసింహరావు, అనిల్ గౌడ్, సంజీవ్, వరలక్ష్మి ధీరజ్, నరసింహ రాజు, నరేందర్ ముదిరాజ్, అశోక్, సురేష్, దుర్గారామ్, రాఘవేంద్ర, జితేందర్ సింగ్, విశాల్ సింగ్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu