Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్ లో విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చందానగర్ లోని పిజెఆర్ స్టేడియంలో క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ పారిస్ ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు విజయం సాధించి కాంస్య పతకం సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హాకీ క్రీడలో భారత్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. ప్రస్తుత భారత జట్టు ప్రదర్శన, హాకీకి లభిస్తున్న ఆదరణ చూస్తే త్వరలోనే హాకీ క్రీడకు దేశంలో పూర్వవైభవం రావడం ఖాయమని అన్నారు. భారత హాకీ జట్టు వరుసగా 2020, 2024 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశ ప్రజలను సంతోషంలో నింపిందన్నారు. ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడా సంగ్రామంలో కాంస్య పతకం సాధించిన హాకీ జట్టును విజయ్ కుమార్ అభినందించారు. తెలంగాణ హకీ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో హకీ జాతీయ పోటీలు నిర్వహిస్తున్నట్లు కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కోచ్ లు నవీన్, మహేశ్, లక్ష్మణ్, శ్రీకాంత్, వెంకటేశ్, రవితో పాటు క్రీడాకారులు, చిన్నారులు పాల్గొన్నారు.
Admin
Ekaburu