Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మీద దేశంలోనే అతిపెద్ద సదస్సును మార్చి 30,31వ తేదీల్లో నగరంలోని జెఎన్టీయూలో నిర్వహిస్తున్నట్లు స్వేచ్ఛ వ్యవస్థాపకుడు వై.కిరణ్ చంద్ర తెలిపారు. ఈ సదస్సుతో ఏఐ రంగంలో హైదరాబాద్ దేశానికి సెంటర్ గా మారేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్వేచ్ఛ తెలంగాణ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కిరణ్ చంద్ర మాట్లాడుతూ జెఎన్టీయూలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి వస్తున్న దాదాపు 2వేల మంది ఐటీ నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. వివిధ దేశాల నుంచి విచ్చేస్తున్న 70మంది ఈ సదస్సు కేంద్రంగా ప్రసంగిస్తారని అన్నారు. స్వేచ్చ సంస్థ భాగస్వామ్యంతో ఏఐ4సొసైటీ నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read : అన్ని వర్గాలను కలిపే వారధి హిందుత్వం : కొండా విశ్వేశ్వరరెడ్డి
వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని, సమాజ శ్రేయస్సు కోసం ఏఐని తీర్చిదిద్దే విషయమై గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, క్వాల్కామ్, ఆర్కా మీడియా తదితర సంస్థల ప్రతినిధులు చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సును పురస్కరించుకొని తెలుగు ఏఐ వాయిస్ అసిస్టెంట్ ను ప్రారంభిస్తున్నామని అన్నారు. రైతులు, వివిధ రంగాల కార్మికులు, పలు విభాగాల్లో పనిచేస్తున్న వారు ఏఐ అద్భుతాలను ఉపయోగించుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ఏఐలో మాతృభాషలో సొంత స్వరాన్ని ఉపయోగించే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ సదస్సు సందర్భంగా సూపర్ కంప్యూటర్ ప్రాజెక్టును సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని 10 వేల కంప్యూటర్లను సూపర్ కంప్యూటర్ అనుసందానం చేస్తుందన్నారు. సదస్సుకు దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరై ఏఐలో ఉన్న అవకాశాలు, మార్కెట్ పై తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేస్తారని అన్నారు.
Admin
Ekaburu