Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : "కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు సౌదీ అరేబియా వరకు వెళ్లడం ఎందుకు...? ఈ మాటలు అన్నది తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి. మన రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర దేశాల్లో మరణిస్తే మరణించిన వారి కుటుంబానికి అండగా నిలవడం, సహాయ సహకారాలు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారికి ఎక్స్ గ్రేషియాతో పాటు వారి కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున సౌదీ అరేబియా పంపించేందుకు ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు మరణించిన వారిని, వారి కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడాడు తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్. సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీళ్లంతా హైదరాబాద్ వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయల్దేరారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Also Read : మీడియా'తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘనా..?
మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు-డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. బస్సు కు పెద్ద ఎత్తున మంటలు అంటుకొని అందులో ఉన్న 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మత సాంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ఇందుకోసం బాధిత ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున కుటుంబ సభ్యులను సౌదీ అరేబియా తీసుకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. కాగా బాధిత కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ సఫియుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు అక్కడి వరకు వెళ్లాలా అంటూ, మృతుల కుటుంబ సభ్యులను అవమానించే విధంగా మహమ్మద్ సఫియుల్లా మాట్లాడడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Ekaburu