Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జల వనరులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ చెలరేగిపోతున్న హైడ్రా భయం అక్రమార్కులకే కాదు.. బ్యాంకర్లకు పట్టుకుంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుతో పలు బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి. హైడ్రా కూల్చివేసిన నిర్మాణాల్లో చాలావరకు బ్యాంకు లోన్లు తీసుకొని నిర్మాణం చేపట్టినవే కావడం, సదరు నిర్మాణదారుల వద్ద నుంచి లోన్ రికవరీ ఏ విధంగా చేయాలో తెలియక బ్యాంకులు మల్లగుల్లాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జలవనరులను, చెరువులను ఆక్రమించి ఎఫ్టిఎల్, బఫర్ జోన్ల పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాలను అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ను ఏర్పాటు చేసింది. హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి.రంగనాథ్ ను నియమించిన ప్రభుత్వం చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా వరుస కూల్చివేతలతో దూసుకెళ్తుంది. హైడ్రా దూకుడుతో చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా దూకుడు కారణంగా పలువురు వీఐపీలు, ప్రముఖుల నిర్మాణాలు సైతం నేలమట్టమయ్యాయి. ఓ వైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండగా.. మరోవైపు రోజుకు వందల సంఖ్యలో అక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయి.
Also Read : రాయదుర్గం లెథర్ ఇండస్ట్రీ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత
పరుస కూల్చివేతలు చేపడుతున్న హైడ్రాతో అక్రమార్కులే కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బ్యాంకులు సైతం పడలేత్తుతున్నాయి. హైడ్రా కూల్చివేసిన నిర్మాణాల్లో అత్యధికం బ్యాంకు లోన్లు తీసుకొని నిర్మాణం చేపట్టినవే కావడంతో ప్రస్తుతం బ్యాంకర్లకు లోన్ రికవరీ భయం పట్టుకుంది. తాము లోన్లు ఇచ్చిన నిర్మాణాలు కూలిపోగా, లోన్లను తిరిగి ఎలా రికవరీ చేయాలనే విషయంలో బ్యాంకర్లు మల్ల గుల్లాలు పడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం మియాపూర్ పరిధిలోని ఈర్ల చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి చేపట్టిన పలు నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ నిర్మాణాల్లో అత్యధికం బ్యాంకు లోన్లు తీసుకుని నిర్మించినవే కావడం గమనార్హం. బాచుపల్లి మండల పరిధి ప్రగతినగర్ ఎర్రకుంటను ఆక్రమించి నిర్మిస్తున్న మూడు అపార్ట్ మెంట్లను సైతం ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ అపార్ట్ మెంట్లను 70 శాతం బ్యాంక్ లోన్లతోనే నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ లోన్లు ఎలా రికవరీ చేయాలనే టెన్షన్ ఆయా బ్యాంక్ అధికారులకు పట్టుకుంది. ఈ కూల్చివేతలతో లోన్ రికవరీ ఎలా అనే ఆందోళన బ్యాంకర్లలో నెలకొనగా, కొత్తగా నిర్మించే బిల్డింగ్ లకు లోన్లు ఇవ్వాలంటేనే బ్యాంకర్లు వెనుకాడే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నగరంలోని పలు బ్యాంకులకు చెందిన అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. కొత్తగా నిర్మించే వెంచర్లు, బిల్డింగ్ లు, అపార్ట్ మెంట్లకు లోన్లు ఇవ్వాలంటే హైడ్రా నుంచి ఎన్వోసీ తీసుకొని రావాలని నిర్మాణదారులకు బ్యాంకర్లు కండీషన్ పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా నిర్మించే నిర్మాణాలకు లోన్లు ఇవ్వాలంటే విలేజ్ మ్యాప్, ఎఫ్ టీఎల్ క్లియరెన్స్ తో పాటు హైడ్రా నుంచి ఎన్వోసీని తీసుకురావాలనే నిబంధన పెట్టాలని బ్యాంకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Admin
Ekaburu