Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : బెల్టు షాపులో బీరుకు పెంచిన 50 రూపాయల అధిక ధర గోపన్ పల్లిలో పెను వివాదానికి కారణమైంది. మద్యం మత్తులో బెల్ట్ షాపు వద్ద చోటు చేసుకున్న వివాదం పరస్పర దాడులకు వెళ్ళింది. ఈ దాడుల్లో పలువురికి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఓవైపు ఈ దాడులపై చందానగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాక మరోవైపు గోపనపల్లి లో ఏరులై పారుతున్న మద్యాన్ని కళ్లకు కట్టింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
గోపనపల్లిలో గురువారం రాత్రి ఓ రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్థానికంగా మద్యం పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో మద్యం సేవించిన కొంతమంది స్థానిక యువకులు మద్యం సరిపోక బీర్ల కోసం అర్ధరాత్రి 2 గంటలకు గోపనపల్లి తండాలో ఉన్న బెల్టు షాపుకు వెళ్లారు. బెల్ట్ షాపులో బీర్లు తీసుకోగా షాపు యజమాని ఒక్కో బీరు కు 50 రూపాయల అదనపు ధర చెప్పాడు. ఈ విషయమై షాపు యజమాని.. యువకుల మధ్య వివాదం జరిగింది. దీంతో సదరు షాపు యజమాని నానక్ రాంగూడలో ఉన్న తన కుమారులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని కుమారులు ఒక్కసారిగా యువకులపై దాడికి తెగబడ్డారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో షాపు ధ్వంసం అయింది. ఈ దాడిలో నలుగురి తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా అర్ధరాత్రి 2 గంటలకు మద్యం విషయమై చోటు చేసుకున్న ఈ వివాదం గోపనపల్లిలో ఏరులై పారుతున్న మద్యాన్ని కళ్లకు కట్టింది. గోపనపల్లి ప్రధాన రహదారి మీద ఉన్న ఓ వైన్ షాపు ప్రోత్సాహంతోనే గ్రామంలో బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వైన్ షాపు నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించకుండా షాపు ముందు ఉన్న ప్రధాన రహదారి మీద సిట్టింగ్ ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తుంటారని స్థానికులు వాపోతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు.
బెల్ట్ షాపు ముందు స్థానికుల ఆందోళన... కాగా అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ దాడులపై శుక్రవారం ఉదయం స్థానికులు బెల్ట్ షాపు ముందు ఆందోళన చేపట్టారు. అప్పటికే షాపు యజమాని బెల్ట్ షాపును మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లగా చందానగర్ పోలీసులు షాపు వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. షాపు వెనక ఉన్న ఇంట్లో బెల్ట్ షాపు యజమాని మద్యం నిల్వ ఉంచాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చందానగర్ పోలీసులు స్థానికులతో కలిసి సదరు ఇంటికి వెళ్లి తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు.. కాగా గోపనపల్లి వివాదంపై చందానగర్ పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. యువకులపై దాడి చేసిన బెల్ట్ షాపు నిర్వాహకులు ప్రకాష్ సింగ్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బెల్టు షాపుపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనలో గోపన్ పల్లికి చెందిన సురేందర్ తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశారు.
Admin
Ekaburu