Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన తోటి ఉద్యోగులను నిలువునా ముంచాడు. మొత్తం 13 మంది బాధితుల నుంచి 6కోట్ల పైచీలుకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన గంట శ్రీధర్ (40) కొండాపూర్ మజీద్ బాండలో నివాసం ఉంటూ మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తాను మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు బంగారం సరఫరా చేస్తానంటూ తనతోటి ఉద్యోగులు, వారి బంధువులను నమ్మించాడు.
Also Read : శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
100 నుండి 200 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే గ్రాముకు 5950 రూపాయలు, 300 నుండి 500 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే గ్రాముకు 5850 రూపాయల తక్కువకు బంగారం సరఫరా చేస్తానని నమ్మించాడు. అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఓ రేటు, నగదు ఇస్తే మరో రేటు అని చెప్పాడు. డబ్బులు చెల్లించిన వారికి 25 రోజుల్లో బంగారం అందజేస్తామని నమ్మించాడు. శ్రీధర్ మాటలు నమ్మిన అతనితో పాటు పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అత్యాశకు పోయి ఒక్కొక్కరు 5 నుంచి 10 లక్షలు ఇచ్చారు. ఈ విధంగా మొత్తం 13 మంది వద్ద నుంచి 6.12 కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సు వింగ్ పోలీసులు నిందితుడు శ్రీధర్ ను అరెస్టు చేశారు.
Admin
Ekaburu