Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : హైటెక్ సిటీ పరిధిలోని అంజయ్య నగర్ లో కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఇంటి మీద దాడి చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కబ్జాదారులను అడ్డుకున్న మహిళలపై దాడి చేసి గాయపరిచారు. తమ మీద జరిగిన దాడిపై మహిళలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంజయ్య నగర్ లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వేనెంబర్ 136లో గల అంజయ్య నగర్ లో ముతోజు మధు అనే వ్యక్తి తన కుటుంబంతో గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. మధు సదరు స్థలంలో నిర్మించుకున్న ఇంటికి జిహెచ్ఎంసి నుంచి ఇంటి నెంబరు 209/136/1/ఏ ను పొందడంతో పాటు విద్యుత్ కనెక్షన్, మంజీర నీటి కనెక్షన్ పొందాడు. కాగా వీరి ఇంటి ఎదురుగా ఉండే షేక్ రహీం, చాంద్ పాషా లు కొన్ని రోజుల క్రితం సదరు స్థలం తమదంటూ వచ్చారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తమ స్థలం కబ్జాకు యత్నించారని బాధితులు వాపోయారు. ఒకసారి ఇతరుల వద్ద నుంచి కొనుగోలు చేశామని... మరోసారి శేరిలింగంపల్లి రెవెన్యూ కార్యాలయం తమకు పట్టా మంజూరు చేసిందంటూ ఆక్రమించేందుకు ప్రయత్నించారని అన్నారు.
Also Read : పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా మెరుపు దాడులు
మధు ఇంట్లో లేని సమయంలో ఇంటి మీద దాడి చేసి ఆక్రమించేందుకు ప్రయత్నించగా షేక్ రహీం చాంద్ పాషాల మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు గతంలో కేసు నెంబర్ 283/2025 కేసు నమోదు చేశారని బాధితులు తెలిపారు. అనంతరం కబ్జాదారులు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం వివాదం కోర్టులో ఉందన్నారు. కాగా సోమవారం సాయంత్రం మధు ఇంట్లో లేని సమయంలో షేక్ రహీం, అతని భార్య, షేక్ చాంద్ పాషా, అతని భార్య కలిసి ఒక్కసారిగా మధు ఇంటిపై దాడి చేశారని ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించగా.. మధు భార్య నిర్మల, కుమార్తె అమనిలు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రహీం, చాంద్ పాషా, వారి అనుచరులు కలిసి నిర్మల, ఆమనిల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ విషయమై బాధితులు డయల్ 100 కు ఫోన్ చేయగా రాయదుర్గం పోలీసులు సంఘటనస్థలికి చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. తమపై జరిగిన దాడిపై ఆమని, నిర్మలలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల పిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu