Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : డ్రగ్స్ పార్టీ కేసులో గచ్చిబౌలి పోలీసులు మరిన్ని కేసులకు సిద్ధం అవుతున్నారు. ఇష్టారాజ్యంగా హోటల్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన రాడిసన్ బ్లూ హోటల్ యాజమాన్యం మీద కేసు నమోదుకు యోచిస్తున్నారు. ఈ మేరకు నోటీసులు సిద్ధం చేసిన గచ్చిబౌలి పోలీసులు వాటిని రాడిసన్ యాజమాన్యానికి అందజేసి కేసు నమోదు చేయనున్నారు. హోటల్ యజమాని కుమారుడు, మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జల వివేకానంద తన సొంత హోటల్ లో విచ్చలవిడిగా డ్రగ్ పార్టీలు నిర్వహించిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు సిద్దమయ్యారు.
Also Read : ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం
డైరెక్టర్ క్రిష్ రిపోర్ట్ నెగటివ్... డ్రగ్స్ పార్టీలో పాల్గొని, కొకైన్ తీసుకున్నాడని అభియోగాలతో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ యూరిన్ శాంపిల్ పరీక్షించగా నెగిటివ్ వచ్చింది. క్రిష్ తో పాటు ఈ కేసులో మరో నిందితుడు చరణ్ శాంపిల్ సైతం నెగటివ్ వచ్చింది. ఆరు రోజుల తరువాత శాంపిల్ తీసుకున్న కారణంగానే నెగటివ్ వచ్చి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి బ్లడ్ శాంపిల్ ను కోర్టు అనుమతితో ఎఫ్ఎస్ఎల్ కు పంపనున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగానే కొకైన్ సేవించారా లేదా అని తుది నిర్ణయానికి రానున్నారు. మరోవైపు డ్రగ్స్ సరఫరాదారు మరొకరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్టు వహిద్ పోలీసు విచారణలో చెప్పడంతో ఎఫ్ఐఆర్ లో పోలీసులు అబ్దుల్ పేరు చేర్చారు.
Admin
Ekaburu