Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఈ మధ్యే నటి అనుష్క ప్రధాన పాత్రలో విడుదలైన చిత్రం ఘాటీ.. ఈ సినిమాలో గంజాయి స్మగ్లర్లు గంజాయిని అడవులు దాటించేందుకు ఉపయోగించే కూలీలే ఘాటీలు... ఈ సినిమా తరహాలోనే గంజాయిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్న రియల్ ఘాటీలు ముగ్గురు నగరంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండగా, ఓ పురుషుడు ఉన్నాడు. సినిమాకు, రియల్ కు ఒకటే తేడా.. సినిమాలో ఘాటీలు గంజాయిని కొండల మీదుగా అడవులు దాటించగా.. రియల్ గా మాత్రం రైళ్లలో గంజాయిని రాష్ట్రాలు, నగరాలు దాటిస్తున్నారు... విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని చందానగర్ పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 45 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అల్లూరి సీతరామరాజు జిల్లా అరకువ్యాలీలోని జాకరవలస గ్రామానికి చెందిన కొర్ర బులికి(31), హుకుంపేట మండలం రంగశీల గ్రామానికి చెందిన పాంగి వెంకట్(35), అనంతగిరి మండలం జెండాగరువు గ్రామానికి చెందిన సెంబి దివ్య రాణి(21) ముగ్గురు కలిసి ఈజీ మనీ కోసం గంజాయి తరలించేందుకు నిర్ణయించుకున్నారు. ఆంధ్రా నుంచి గంజాయిని ముంబైకి తరలించి అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని గంజాయితో విశాఖపట్నం నుండి ముంబైకి ట్రైన్లో బయలుదేరారు. రైలులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న నగరంలోని చందానగర్ పోలీసులు మంగళవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ ఒకటో ఫ్లాట్ఫామ్ మీద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 21 ప్యాకెట్లలో 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Admin
Ekaburu