Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి వరప్రదాయని ఐన ఔటర్ రింగు రోడ్డు గంజాయి స్మగ్లింగ్ కు రాచబాటగా మారుతుంది. భారీ ఎత్తున నగరాన్ని ముంచెత్తుతున్న గంజాయి ఔటర్ రింగు రోడ్డు మీదుగా నగరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఎవ్వరి కంటబడకుండా ఔటర్ ఎక్కితే చాలు.. క్షేమంగా గమ్యానికి చేరుకోవచ్చనే ఆలోచనతో గంజాయి స్మగ్లర్లు ఔటర్ రింగు రోడ్డును తమ రవాణా కేంద్రంగా మార్చుకుంటున్నారు. ఎక్కడ బందోబస్తు లేదో చూసి ఔటర్ ఎక్కడం... అనువైన ఎక్జిట్ చూసుకొని ఔటర్ దిగి నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్, ఐటీ కారిడార్ కు గంజాయి చేరవేయడం ఔటర్ రింగు రోడ్డు స్మగ్లర్లకు అత్యంత అనువయిన రహదారిగా మారిపోయింది. నగరానికి వచ్చే గంజాయి తో పాటు తెలంగాణ మీదుగా రాష్ట్రాలు దాటే గంజాయి రవాణాకు సైతం స్మగ్లర్లు ఔటర్ నే ఎంచుకుంటున్నారు.
Also Read : బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి
గతంలో పలు సందర్భాల్లో ఔటర్ మీదుగా రాష్ట్రాలు దాటుతున్న గంజాయితో పాటు నగరానికి చేరుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నా, అది రవాణా అవుతున్న సరుకులో పావుశాతనికంటే తక్కువేనని భావిస్తున్నారు. మిగిలిన మొత్తం క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతుంది. తాజాగా ఆదివారం ఉదయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కొల్లూరు ఔటర్ టోల్ గేటు వద్ద 32కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. పట్టుబడిన గంజాయి విలువ 10.50 లక్షల రూపాయలని పోలీసులు తెలిపారు. బానోతు లక్ష్మణ్ అనే యువకుడిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద ఒక్కోటి 2కిలోల బరువున్న 16 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్దకు చెందిన లక్ష్మణ్ పటన్ చెరు పరిధిలోని బానురు వెలిమలలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఔటర్ రింగు రోడ్డు మీదుగా ఐటీ కారిడార్ కు గంజాయి చేరవేస్తుండగా పోలీసులు లక్ష్మణ్ ను పట్టుకున్నారు.
Admin
Ekaburu