Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మరో భారీ డ్రగ్స్ ముఠా పోలీసుల చేతికి చిక్కింది. సైబరాబాద్ ఎస్ఓటీ, టిజి నాబ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి డ్రగ్స్ ముఠాను వలపన్ని పట్టుకున్నారు. ఖరీదైన కార్లలో ఐటి కారిడార్ కు వచ్చిన 4గురు డ్రగ్స్ సరఫరాదారులను, 4గురు కొనుగోలుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 4కోట్ల రూపాయల విలువైన 620 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి టెలికాంనగర్ లో డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, రాయదుర్గం పోలీసులు, టిజి నాబ్ అధికారులు నిఘా పెట్టారు. రాజస్థాన్ కు చెందిన నలుగురు డ్రగ్స్ వ్యాపారులు నిషేధిత హెరాయిన్ తో టెలికాంనగర్ కు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. డ్రగ్స్ వ్యాపారులతో పాటు మరో నలుగురు డ్రగ్స్ కొనుగోలుదారులు సైతం పోలీసుల చేతికి చిక్కారు. వీరి వద్ద నుంచి 4.30 కోట్ల రూపాయల విలువైన 620 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన హుందాయ్ క్రెటా, మహేంద్రా ఎక్స్ యువి 500 కార్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
Admin
Ekaburu