Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : "మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగింది... మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెట్టి ఓ 82 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్ నుంచి 1.38 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. వృద్ధుడి పిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్(82)కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బిఐ ప్రతినిధి అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని, మీపై కేసు నమోదయ్యిందని భయపెట్టాడు. మీతో ముంబై సైబర్ క్రైమ్ అఫీసర్ మాట్లాడుతాడంటూ వాట్సప్ కాల్లో మరో వ్యక్తితో మాట్లాడించాడు.
Also Read : మూడు రోజుల పోలీసు కస్టడీకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్
సదరు వ్యక్తి వృద్ధుడితో.. మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని, మీ అధార్ వివరాలు ఇవ్వాలని, మీ బ్యాంక్ అకౌంట్లను చెక్ చేస్తామని చెప్పడంతో, భయపడిపోయిన వృద్ధుడు తన అధార్ కార్డు వివరాలను వారికి చెప్పాడు. ఆ తర్వాత వారి బెదిరింపులకు భయపడిన వృద్ధుడు వారు చెప్పిన బ్యాంకు అకౌంట్లకు 1.38 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. తరువాత సన్నిహితులకు చెప్పడంతో విషయం వెలుగులోకి రాగా, మోసపోయినట్లు గుర్తించిన రిటైర్డ్ ఇంజనీర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన శంకర్ గణేష్(46), సహచరుడు ఎలంచెజియన్ సత్యవేల్లను అరెస్ట్ చేశారు. శంకర్ గణేష్ తన అనుచరుడితో కలిసి 10శాతం కమిషన్ తీసుకొని సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సచిన్, జెస్మిన్ మోండల్, ముత్తుకుమార్, సలీమ్ అనే వ్యక్తులు అఫీసర్లుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల రూపాయలు కొట్టేసి తమ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Admin
Ekaburu