Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండి.. కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వ్యక్తి మద్యానికి బానిసగా మరి భార్య, పిల్లలకు తలనొప్పిగా మారాడు. ప్రేమను పంచాల్సింది పోయి రోజు మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను కొడుతూ మానసికంగా వేధిస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన భార్య అతని మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన అలీ హుస్సేన్ లస్కర్ (35) తన భార్య రుస్తానా బేగం లస్కర్, ఇద్దరు కుమార్తెలు, కొడుకుతో కలిసి రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన అలీ హుస్సేన్ నిత్యం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను, పిల్లలను కొడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదిన అర్ధరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన అలీ హుస్సేన్ భార్యతో గొడవ పడి కొట్టాడు. మరుసటి రోజు ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
Also Read : గచ్చిబౌలిలో అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
రోజు మద్యం తాగి వచ్చి తనను, పిల్లలను కొడుతుండడంతో భర్త వేధింపులతో విసిగిపోయిన రుస్తానాబేగం భర్త మెడకు చున్నీ బిగించి ఉపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుడి సోదరుడు అక్బర్ హుస్సేన్ సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మద్యం తాగి వచ్చి కొడుతుండడంతో వేధింపులు భరించలేక తానే హత్య చేసినట్లు మృతుడి భార్య రుస్తానాబేగం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తండ్రి హత్యకు గురవ్వడం... తల్లి జైలుపాలు కావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఎక్కడో అస్సాం నుంచి పొట్టచేత పట్టుకుని తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చిన ముగ్గురు పిల్లలు ప్రస్తుతం దిక్కులేని వారిగా మిగులగా, సంపాదన కోసం వేల కిలోమీటర్లు వచ్చిన వలస కుటుంబాన్ని మద్యం మత్తు ఛిద్రం చేసింది.
Admin
Ekaburu