Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : నగరంలో గంజాయి వ్యాపారంలో లేడీ డాన్ గా పేరుగాంచిన నీతూ భాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో 18 కేసుల్లో నిందితురాలిగా ఉన్న నానక్ రాంగూడకు చెందిన నీతూ భాయ్ మీద పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. భర్త, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఐటీ కారిడార్ లో గంజాయి వ్యాపారం చేసి భారీగా లాభాలు ఆర్జించిన నీతూ భాయ్ వచ్చిన లాభాలతో కోట్లలో ఆస్థులు కూడబెట్టింది. చివరిసారిగా పోలీసులకు చిక్కిన సమయంలో నీతూ భాయ్ 16 బ్యాంకు అకౌంట్లలోని 1.50కోట్లను ఫ్రీజ్ చేశారు. గంజాయి వ్యాపారంలో వచ్చిన లాభాలతో కూడబెట్టిన 4కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. కొన్నిరోజులు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన నీతూ భాయ్ తిరిగి గంజాయి వ్యాపారం ప్రారంభించింది. ఓ కేసు విచారణలో సిద్దిపేట పోలీసులకు నీతూ భాయ్ గంజాయి వ్యాపారం గుట్టు తెలియడంతో సిద్దిపేట, గచ్చిబౌలి పోలీసులు, టిఎస్ నాబ్ అధికారులు కలిసి నానక్ రాంగూడలోని నీతూ భాయ్ ఇంటి మీద బుధవారం రాత్రి దాడి చేశారు.
Also Read : డాక్టర్స్ కాలనీకి లక్ష రూపాయలు అందజేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
ఈ దాడిలో గంజాయి అమ్ముతున్న నీతూ భాయ్, ఆమె భర్త మున్ను సింగ్, బంధువులు సురేఖ, మమతలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 22 కిలోల గంజాయి, 22లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నానక్ రాంగూడలో కిరాణా షాప్, హోటల్ ముసుగులో స్థానిక యువతకు, ఐటీ ఉద్యోగులకు నీతూ భాయ్ గంజాయి విక్రయిస్తుండగా, పోలీసులు దాడి చేసిన సమయంలో నీతూ ఇంటి వద్ద గంజాయి తాగుతున్న 13మందిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గంజాయిని దూల్ పేటలో అంగురీ భాయ్ వద్ద కిలో 8వేల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు నీతూ భాయ్ తెలిపింది. గంజాయి ని 5గ్రాములకు ప్యాకెట్ చొప్పున తయారు చేసి, ఒక్కో ప్యాకెట్ 500 రూపాయలకు విక్రయిస్తుంది. ఒక్కో కిలో మీద 50వేల లాభాన్ని ఆర్జిస్తున్న నీతూ భాయ్ లగ్జరీగా జీవిస్తున్నట్లు విచారణలో తేలింది. ఆమె వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లు ఒక్కోటి లక్ష రూపాయల పైచిలుకు ధర ఉండడం విశేషం.
Admin
Ekaburu