Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మద్యానికి బానిసగా మారిన వ్యక్తి డబ్బు కోసం ద్విచక్రవాహనాలను దొంగిలించసాగాడు. చోరీ చేసిన వాహనాలను 3 నుంచి 5వేల ధరకు ఇతరులకు విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. గత ఏడాదిన్నర కాలంగా 14 ద్విచక్రవాహనాలను చోరీ చేసిన నిందితుడిని ఎట్టకేలకు రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి శ్రీధర్ వెళ్లడించారు.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ కు చెందిన కటాయి రాములు(23) జీహెచ్ఎంసీలో చెత్త కార్మికుడిగా పనిచేస్తూ లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివాసం ఉంటున్నాడు. కాగా మద్యానికి బానిసగా మారిన రాములును భార్య వదిలిపెట్టింది. మద్యం తాగేందుకు డబ్బు కోసం రాములు ద్విచక్రవాహనాల దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
Also Read : గచ్చిబౌలిలో ఉత్సాహంగా గ్రేస్ క్యాన్సర్ రన్
ఈ క్రమంలో గత ఏడాదిన్నర కాలంగా రాయదుర్గం పరిధిలో 8, చందానగర్ పరిధిలో 5, ఫిలింనగర్ పరిధిలో ఓ బైకును చోరీ చేశాడు. చోరీ చేసిన వాహనాలను 3 నుంచి 5వేల ధరకు ఇతరులకు విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. ఈనెల 12వ తేదీన చందానగర్ లో ఓ బైక్ చోరీ చేసి అదే వాహనం మీద రాయదుర్గం వైపు వస్తుండగా, మైఫిల్ హోటల్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. రాములును అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు విచారించగా మొత్తం 14 బైక్ చోరీలకు పాల్పడినట్లు వెల్లడించాడు. దీంతో రాములును అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 6.50 లక్షల విలువైన 14 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించారు. సమావేశంలో రాయదుర్గం ఇనిస్పెక్టర్ వెంకన్న, డిఐ భూపతి తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu