Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : పేరుకేమో హైటెక్ సిటీ.. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం లోటెక్.. జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు... అడుగడుగునా నిఘా నేత్రాలు... అత్యంత పటిష్ట పోలీసు బందోబస్తు... నిత్యం వీఐపీల సైరన్ మోతలు... ఇది హైటెక్ మండలం శేరిలింగంపల్లికి ఒక వైపు దృశ్యం.. మరోవైపు చూస్తే నిత్యం వేలకొద్ది వాహనాలు ప్రయాణించే ప్రధాన రహదారిపై మహిళలు నడిచి వెళ్లాలంటే భయం భయం.. ఎక్కడో మారుమూల పల్లెల్లో సైతం అర్థరాత్రి ఏ జంకు లేకుండా మహిళలు చిన్నారులు తిరుగుతుండగా ఐటీ కారిడార్ నడిబొడ్డున పట్టపగలు అడుగు వేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి... ఎందుకంటే హైటెక్ సిటీలో అధికారులకు బాధ్యత గుర్తురాదు... వైన్ షాపులకు నిబంధనలు పట్టవు... మందుబాబులకు పరిసరాలతో పనిలేదు... వైన్ షాపుల లాభాపేక్షకు ప్రధాన రహదారులే మందుబాబుల సిట్టింగ్స్ స్థావరాలుగా మారుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గోపనపల్లి వైన్ షాపు పరిసరాలు.
గతంలో ఇక్కడ ఓపెన్ ప్రదేశాల్లో సిట్టింగ్ కారణంగా హత్యలు చోటు చేసుకున్న సంఘటనలు ఉండగా, వాటి నుంచి వైన్ షాప్ నిర్వాహకులు పాఠాలు నేర్వకపోగా అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దీని కారణంగా గోపన్ పల్లి తండా వైన్ షాపు పరిసర ప్రాంతాలు ఓపెన్ సిట్టింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. వైన్ షాపుకు ఇరువైపులా రహదారులే సిట్టింగ్ స్పాట్లుగా మందుబాబులు చెలరేగుతున్నారు. మిట్ట మధ్యాహ్నం ప్రధాన రహదారిపై కూర్చుని మద్యం సేవిస్తున్న మందుబాబులను అడ్డుకునేవారు లేకుండా పోయారు.
దీని కారణంగా ఈ దారిలో ప్రయాణించాలంటే మహిళలు చిన్నారులు వణుకుతున్నారు. గతంలో ఈ వైన్ షాపు నిర్వాహకులపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ఎక్సైజ్ అధికారులు, చందానగర్ పోలీసులు పట్టనట్టు వ్యవహరించడంతో వైన్ షాప్ నిర్వాహకులు మరింతగా రెచ్చిపోతున్నారు. రహదారిపైనే తినుబండారాలను విక్రయిస్తూ మందుబాబులను రోడ్డుపై కూర్చోబెట్టి మద్యం సరఫరా చేస్తున్నారు. వైన్ షాపు ముందే వాహనాలను నిలిపి అందులోనే మద్యం సేవిస్తున్నారు. మందుబాబుల కారణంగా ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, వైన్ షాపు ముందు ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
Admin
Ekaburu