Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఓ నిర్మాణదారుడి అత్యాశ ఇరుగుపొరుగు వారికి ప్రమాదకరంగా మారగా, మొత్తం పరిసరాలను అంధకారంలో ముంచేస్తుంది. అక్రమ నిర్మాణం చేపట్టిన నిర్మాణదారుడు తన నిర్మాణం బయటకు కనిపించకుండా కట్టిన పరదా ప్రమాదానికి దారి తీసింది. భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనానికి కట్టిన గోవాకర్రలతో కూడిన పరదా విరిగి హై టెన్షన్ వైర్ల మీద పడింది. ఆ సమయంలో భవనం పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు భవన యజమాని అత్యాశ, నిర్లక్ష్యం కారణంగా నల్లగండ్ల ప్రాంతం కొన్ని గంటలపాటు అంధకారంలో ఉండిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
Also Read : ఈర్ల చెరువు బఫర్ జోన్ నిర్మాణదారులపై కేసు నమోదు
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రికి ఎదురుగా ఓ నిర్మాణదారుడు భవన నిర్మాణం చేపట్టాడు. ప్రధాన రహదారికి ఆనుకొని దాదాపు 100 గజాల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. తన అక్రమ నిర్మాణం బయటకు కనిపించకుండా ఆదరాబాదరాగా భవనం ముందు వైపు గోవా కర్రలతో పరదా కట్టి అడ్డం పెట్టాడు. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఈదురుగాలులతో గోవా కర్రలు విరిగి భవనం ముందున్న హై టెన్షన్ వైర్ల మీద కర్రలు, పరదా పడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దం, మంటలతో విద్యుత్ సరఫరా స్థానికంగా నిలిచిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో భవనం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటికైనా ఇటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
Ekaburu