Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : రాయదుర్గం నాగాహిల్స్ లే అవుట్ ప్లాట్లపై మరోసారి వివాదం చెలరేగింది. ఎన్నోఏళ్లుగా తమ ప్లాట్ల కోసం కోర్టుల చుట్టూ తిరిగి, చివరికి కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెల్లడించినా తమ సొంత అసోసియేషన్ రూపంలో తమకు తిరిగి కష్టాలు మొదలయ్యాయని పలువురు ప్లాట్ల యజమానులు ఆందోళన చేపట్టారు. తమ ప్లాట్ల కబ్జా, అసోసియేషన్ సభ్యుల దౌర్జన్యం మీద ప్లాట్ల యజమానులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం నాగాహిల్స్ లే అవుట్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు యజమానులు మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబరు 66/3లో 25ఎకరాల విస్తీర్ణంలో 1984లో నాగాహిల్స్ ఫేజ్2 లేఅవుట్ చేశారని అన్నారు. అందులో మొత్తం 295 ప్లాట్లను యజమానులు కొనుగోలు చేశారని, అనంతర కాలంలో సదరు భూమి ప్రభుత్వ స్థలమంటూ వివాదం కోర్టులో కొనసాగిందని అన్నారు. రోడ్డు విస్తరణలో కొన్ని ప్లాట్లు కోల్పోగా చివరికి 250 ప్లాట్లు మిగిలాయని, గత 10 సంవత్సరాల క్రితం కోర్టు వివాదం పరిష్కారం అయ్యిందని, సదరు భూమి నాగాహిల్స్ ప్లాట్ల యజమానులదేనని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కాగా లే అవుట్ చేయకముందు ఉన్న భూయజమాని వారసులను అడ్డుపెట్టి నాగా హిల్స్ అసోసియేషన్ సభ్యులు కొత్త కుట్రకు తెరలేపారని వాపోయారు.
Also Read : యువత చూపు కాంగ్రెస్ వైపు : శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
తాము సూచించిన నిర్మాణ సంస్థకు ప్లాట్లను డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇప్పటికే చాలా వరకు యజమానులు అగ్రిమెంట్ చేసుకోగా, 25మంది యజమానులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని అన్నారు. తమ మధ్య ఈ వివాదం కొనసాగుతుండగా, తాజాగా తమ ప్లాట్లను ఆక్రమించి లే అవుట్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని వాపోయారు. ప్రశ్నిస్తే తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని, ప్రైవేట్ సైన్యంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విషయమై పలుమార్లు రాయదుర్గం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశామని, తాజాగా సోమవారం మరోసారి పిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు, పోలీసులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో జిఎస్ఎస్. రాజు, రవి, అచ్చుతరామారావు, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్ చారి, దినకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu