Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంక్రీట్ జంగల్ హైటెక్ సిటీలో పల్లె అందాలను వెదజల్లుతున్న శిల్పారామానికి పూర్వవైభవం తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య ఉన్నత విద్యా, శిక్షణ సంస్థగా నిథమ్ ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) సంస్థను, మాధాపూర్ లోని శిల్పారామంను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
Also Read : గోపన్ పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
నిథమ్ లో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించిన మంత్రి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక, ఆతిథ్య రంగానికి ప్రాధాన్యం పెరుగుతుందని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు సులువుగానే ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. నిథమ్ లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు ఉపకరణాలు, కొత్త కోర్సులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతర్జాతీయ పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, గైడ్స్ కు ఫారెన్ లాంగ్వేజ్ కోర్స్ లను కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని, దీనికి ఇఫ్లూతో అనుసంధానం కావాలని అన్నారు.
అనంతరం మాదాపూర్ లోని శిల్పారామాన్ని మంత్రి జూపల్లి సందర్శించారు. శిల్పారామం నిర్వహణ, అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో శిల్పారామం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, లోతుగా అధ్యయనం చేసి శిల్పారామం ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శిల్పారామంకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిథమ్ డైరెక్టర్ కె. నిఖిల, టిఎస్ టిడిసి ఎండీ రమేష్ నాయుడు, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి.కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu