Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : రాయదుర్గంలోని లెథర్ ఇండస్ట్రీ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. సదరు స్థలం మీద కొన్ని సంవత్సరాలుగా కోర్టులో వివాదం నడుస్తుండగా, గతంలో కోర్టు లెథర్ ఇండస్ట్రీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా సదరు భూమిని లెథర్ ఇండస్ట్రీ టిఎస్ఐఐసికి కేటాయించగా, అందులో ఉన్న అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నిర్మాణదారులు స్పందించకపోవడంతో సోమవారం కూల్చివేతలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం పైగా సర్వే నెంబరు 1,3,4,19లలో తెలంగాణ లెథర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్థలం ఉంది. ఇదే స్థలంలో లిడ్ క్యాప్ సంస్థ ఉంది. కాగా ఈ స్థలంలో 6 ఎకరాల విస్తీర్ణాన్ని గతకొంత కాలం క్రితం టిఎస్ఐఐసికి కేటాయిస్తూ లెథర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ప్రమోషన్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఆరు ఎకరాల వరిధిలో 500 గజాల విస్తీర్ణంలో రెండు పక్కా భవనాలు, మరో 500 గజాల విస్తీర్ణంలో మూడు పాక్షిక రేకుల షెడ్లు ఉన్నాయి.
Also Read : కోటి ఆశలతో రాష్ట్రాలు దాటివచ్చిన కుటుంబంలో మద్యం చిచ్చు
ఈ నిర్మాణాలను ఖాళీ చేయాలని లెథర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై భవన యజమానులు స్పందించకపోవడంతో సోమవారం కూల్చివేతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, టిఎస్ఐఐసి అధికారులతో కలిసి లెథర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అధికారులు రెండు పక్కా భవనాలను, 3 పాక్షిక షెడ్లను జెసిబిలతో కూల్చివేశారు. సదరు స్థలం ప్రభుత్వ స్థలమని, లెథర్ ఇండస్ట్రీకి చెందిన స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. లెథర్ ఇండస్ట్రీ క్వార్టర్స్ లో ఉన్న వారు కొంతమంది తమ ప్రైవేటు స్థలమంటూ వివాదం సృష్టించి కోర్టుకు వెళ్లారని, కోర్టు ప్రభుత్వ స్థలమని గతంలోనే తీర్పు ఇచ్చిందన్నారు. కాగా ఎటువంటి నోటీసులు లేకుండా తమ ఇళ్లను కూల్చివేశారని, స్థానికులు ఆందోళనకు దిగడం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.
Admin
Ekaburu