Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించి విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన క్రీడోత్సవాల్లో పార్టీ పాటలను ప్రదర్శించి, సదరు పాటలకు అనుగుణంగా స్కూల్ విద్యార్థులతో డాన్సులు చేయించారు. జాతీయ కరాటే క్రీడా వేదికపై 'సింగమోలే కదిలినాడు కాంగ్రెస్ సూరీడు' అంటూ రేవంత్ రెడ్డి మీద రూపొందించిన కాంగ్రెస్ పార్టీ పాటను ప్రదర్శించి... సదురు పాటకు అనుగుణంగా క్రీడాకారులతో డ్యాన్సులు చేయించారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించిన క్రీడా వేదికపై పార్టీ నాయకులకు స్థానం కల్పించి స్థానిక కార్పొరేటర్ కు కనీస ఆహ్వానం అందించకుండా విమర్శలను ఎదుర్కొన్నారు. గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
Also Read : శేరిలింగంపల్లిలో బయట పడ్డ నకిలీ జీఓ 59 పట్టాల బాగోతం
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ ఛాంపియన్ షిప్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఛాంపియన్ షిప్ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులను భారీ ఎత్తున తీసుకువచ్చి ఇండోర్ స్టేడియంను నింపారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతాడని మొదట భావించినా అనివార్య కారణాల కారణంగా ముఖ్యమంత్రి రాలేదు. ఇదే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్ కుమార్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించడం కోసం అత్యుత్సాహాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఏకంగా రేవంత్ రెడ్డిపై రూపొందించిన కాంగ్రెస్ పార్టీ గీతాన్ని ప్రదర్శించి అభాసుపాలయ్యారు. 'మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు కాంగ్రెస్ సూరీడు' అంటూ రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద రూపొందించిన కాంగ్రెస్ పార్టీ పాటను ప్రదర్శించి, సదరు పాటకు అనుగుణంగా విద్యార్థులతో డ్యాన్సులు... కేరింతలు కొట్టించారు. స్కూల్ విద్యార్థులను పార్టీ పాటకు జేజేలు కొట్టిస్తూ, డాన్సులు చేయించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు కార్యక్రమ వేదికపై ప్రోటోకాల్ కు అనుగుణంగా స్థానిక గచ్చిబౌలి కార్పొరేటర్ కు ఆహ్వానం అందకపోగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పక్క డివిజన్ల కు చెందిన కార్పొరేటర్లు, నాయకులు ఆసీనులు కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. వేదికపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర డివిజన్ల కార్పొరేటర్లు కూర్చోగా, స్థానిక కార్పొరేటర్ కనిపించ లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడోత్సవాల్లో పార్టీ పాటలు ప్రదర్శించి, అందుకు అనుగుణంగా క్రీడాకారులతో డ్యాన్సులు చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Admin
Ekaburu