Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల విజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ సంబరాలు శ్రుతిమించాయి. శుక్రవారం నిర్వహించిన ఓట్ల కౌంటింగ్ అనంతరం గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును క్రేనుకు వేలాడదీసి ఊరేగింపు నిర్వహించడం.. కారును పల్టీలు కొట్టించి ధ్వంసం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కారుపై ఓవైపు కేసీఆర్, ఓవైపు కేటీఆర్ పేర్లతో గులాబీ రంగు తో ఉన్న కారును క్రేనుకు వేలాడదీస్తూ.. పల్టీలు కొట్టించి... అందులో నుంచి మనుషులు కింద పడుతున్నట్లుగా చిత్రీకరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమైనా, ప్రత్యర్థి పార్టీ గుర్తును ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వారి వ్యవహార శైలిని బహిర్గతం చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.
Also Read : ఆముదం గింజల నుండి 'రిసిన్' విషం
Admin
Ekaburu