Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : వేసవికాలం ప్రారంభంలోనే శేరిలింగంపల్లిలో ప్రజల నుంచి మంచినీటి సరఫరాపై పిర్యాదులు వస్తున్నాయని, ప్రజల సమస్యలపై జలమండలి అధికారులు తక్షణమే స్పందించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే గాంధీ మంచి నీటి సరఫరా వ్యవస్థలో అంతరాయం లేకుండా ప్రజలకు స్వచ్చమైన త్రాగు నీరు అందించడమే ధ్యేయంగా జలమండలి అధికారులు పని చేయాలని సూచించారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు సురక్షితమైన మంచి నీళ్లు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు మెరుగైన మంచి నీటి సరఫరా అందించాలని, మంచి నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
Also Read : రివార్డులు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు
నియోజకవవర్గం పరిధిలోని కొన్ని కాలనీలలో తక్కువ ప్రెజర్ తో నీరు వస్తున్నాయని, మరికొన్ని చోట్ల 4 రోజులు గడిచినా నీరు వదలడం లేదని, కొన్ని కాలనీలలో సరిపడా మంచి నీరు రావడం లేదని ప్రజలు పిర్యాదు చేస్తున్నారని అన్నారు. సరిపడినంత నీటిసరఫరా లేక పలు కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. జలమండలి ట్యాంకర్లు సైతం సరైన సమయానికి రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మంచి నీటి సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు సూచించారు.
Admin
Ekaburu