Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే ల మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ పరిధిలోని మియపూర్ చౌరస్తా వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మియపూర్ జాతీయ రహదారిని దిగ్బందించి ధర్నా నిర్వహించారు. రహదారిపై రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
Also Read : సినిమాల్లో అవకాశం కల్పిస్తానని సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళా ఎమ్మెల్యేల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని, వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులుగా, మాజీ మంత్రులుగా, ప్రస్తుత శాసనసభ సభ్యులుగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు ఎంతో హుందాగా ప్రవర్తించడంతో పాటు ప్రజలకు ఎంతో సేవచేసారని, అటువంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటి సీఎం లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
Admin
Ekaburu