Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ధీమా వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి బిఆర్ఎస్ శ్రేణులు చేవెళ్ల బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తో సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో అభ్యర్థి జ్ఞానేశ్వర్ తో పాటు ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం మీద ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోరని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించడం ఖాయమని అన్నారు.
Also Read : తక్కువ ధరకు బంగారమంటూ తోటి ఉద్యోగులకు టోకరా ఇచ్చిన ఐటీ ఉద్యోగి
ముఖ్యమంత్రి గా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేడు ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హామీలను విస్మరించిందన్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారని, కేసీఆర్ పాలనను మరోసారి కోరుకుంటున్నారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీని కట్టబెట్టేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా తో పాటు నీరుడి గణేష్, సత్యనారాయణ, రాజు నాయక్ లతో పాటు డివిజన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Admin
Ekaburu