Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మజీద్ బండ బీజేపీ కార్యాలయంలో శక్తి వందన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జీ హెచ్ఎంసీ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్ ప్రసంగాన్ని విన్నారు. ఈ కార్యక్రమానికి విశ్వేశ్వరరెడ్డితో కలిసి కేంద్ర రైల్వే, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ విక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శన జర్దోష్ విక్రమ్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు
Also Read : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అనుచరుడు అరెస్ట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, కొత్త పార్లమెంట్ హౌస్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రంలోని మోడీ కేబినెట్ లో అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన మంత్రిత్వ శాఖలను మహిళలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ ఉన్నారని, పదకొండు మంది మహిళా మంత్రులు మోడీ క్యాబినెట్ లో పనిచేస్తున్నారని అన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా పాలన సాగిస్తున్నారని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రంగా ఉన్నప్పటికీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటును ప్రకటించిన ఏడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను నెంబర్ వన్ దేశంగా మార్చాలని ప్రధాని మోదీ సంకల్పించారన్నారు. మహిళల ప్రమేయం, సాధికారత లేకుండా భారతదేశం పురోగమించదని ఆయన బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్లలో బీజేపీ జెండా ఎగురవేసి ప్రధానికి గెలుపును కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్షపతి యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ,ప్రధాన కార్యదర్షి సమతా, రాష్ట్ర కార్యదర్శి సాహు శ్రీలత, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu