Ekaburu - శేరిలింగంపల్లి / హైదరాబాద్ : నేటితరం విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం చివరి రోజున గచ్చిబౌలి డివిజన్ పరిధిలో జిహెచ్ఎంసి అధికారులు, స్థానికులు, పాఠశాల విద్యార్థులతో కలిసి వన మహోత్సవం నిర్వహించారు. రాయదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవంలో స్కూల్ విద్యార్థులతో కలిసి గంగాధర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం గోపనపల్లి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వనమహోత్సవంలో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వారే పర్యావరణాన్ని కాపాడతారన్నారు. మన భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పచ్చదనంతో నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సంజయ్, రాయదుర్గం విద్యా కమిటీ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగ మల్లేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాజ్ బాబు, యూబీడి డిప్యూటీ డైరెక్టర్ అనిల్, మేనేజర్ విక్రమ్ చంద్రతో పాటు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Admin
Ekaburu