Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : దీప కాంతుల దీపావళి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా జరుపుకున్నారు. మాదాపూర్ సున్నం చెరువు హైడ్రా కూల్చివేత బాధితులతో కలిసి ఈ దీపావళి సెలబ్రేషన్స్ ను సోమవారం చేసుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గత కొన్ని రోజుల క్రితం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతల కారణంగా పలువురు పేదలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దీంతో దీపావళి వేడుకలను సోమవారం బీఆర్ఎస్ నాయకులు సున్నం చెరువు బాధితులతో కలిసి చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి. రామారావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా సోమవారం సున్నం చెరువు బాధితులను కలిశారు. సున్నం చెరువు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Also Read : ఆక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను స్పెషల్ టీమ్ అడ్డుకునేనా.. ?
అనంతరం సాయిబాబా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న పేదలను రాత్రికి రాత్రే కట్టుబట్టలతో రోడ్డున పడవేయడం హేమన్నారు. పేదలపై ప్రతాపం చూపిస్తున్న హైడ్రా కు ప్రభుత్వ భూములు ఆక్రమించిన పెద్దలపై ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. గూడు లేక ఇబ్బందులు పడుతున్న పేదలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచన అభినందనీయమన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సున్నం చెరువు బాధితులకు శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సున్నం చెరువు బాధితులు పాల్గొన్నారు.
Admin
Ekaburu