Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : మొక్కలు నాటడం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ భాద్యతలు తీసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. గోపన్ పల్లి కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలే శ్రీరామ రక్ష అని, సమస్త జీవ కోటికి ప్రాణధారంగా చెట్లు నిలుస్తాయని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఆక్సిజన్ అవసరం బోధపడిందని, మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి లో విజయవంతం చేయాలని కోరారు.
Also Read : రాయదుర్గం నాగాహిల్స్ ప్లాట్లపై మరోసారి వివాదం
కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వ్యర్థాల తొలగింపు, దోమల నివారణ, చెరువుల సంరక్షణ, నాలల పూడికతీత, వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని స్థానిక ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులతో పాటు నాయకులు గణేష్ ముదిరాజ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రిప్రగడ సత్యనారాయణ, రాజు నాయక్, వినోద్, మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu