Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మిస్తున్న నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగా ఏర్పడిన హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపడుతున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మధీనగూడ ఈర్ల చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మదీనగూడ సర్వేనెంబర్ 26లో ఈర్ల చెరువు విస్తరించి ఉంది. కాగా ఈ చెరువు బఫర్ జోన్ పరిధిలో గత కొంతకాలంగా భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఎటువంటి ఎన్వోసీ తీసుకోకుండా స్థానిక జిహెచ్ఎంసి అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో ఈర్ల చెరువు బఫర్ జోన్ లో యదేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
Also Read : ఒలింపిక్స్ లో హాకీ జట్టు గెలుపుతో పిజెఆర్ స్టేడియంలో సంబురాలు
ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన హైడ్రా చర్యలు చేపట్టింది. ఈర్ల చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి వైశాలి నగర్ లోని ప్లాట్ నెంబర్ 148, 149, 150లలో భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు గుర్తించి, శనివారం కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలను హైడ్రా కమిషనర్ ఏవి. రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. హైడ్రా ఆధ్వర్యంలో భారీ ఎత్తున సిబ్బంది, అధునాతన వాహనాలతో కూల్చివేతలు చేపట్టగా, పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఈర్ల చెరువు బఫర్ జోన్ పరిధిలో నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. కాగా ఈర్ల చెరువు బఫర్ జోన్ అక్రమణ, నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంపై గతంలోనే ఇరిగేషన్ శాఖ జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ అధికారులకు సమాచారం అందించినా స్పందన లేకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టడం విశేషం.
Admin
Ekaburu