Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : బాధ్యత లేని ప్రభుత్వాల గొడ్డలి వేటు కారణంగా గూడు చెదిరిన మూగజీవాలు జనారణ్యంలో ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నాయి. నిన్నటి వరకు పచ్చటి చెట్ల మధ్య స్వేచ్ఛగా తిరిగిన అడవి జంతువులు నేడు ప్రాణ భయంతో ఇళ్ల మధ్య పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న అడవిలో జెసిబిలు కదం తొక్కి పచ్చటి చెట్లను నెలకూల్చడంతో అందులో ఉన్న జింకలు ప్రాణ భయంతో హైటెక్ సిటీ చుట్టుపక్కల కాలనీలకు చేరుతున్నాయి. ఈ క్రమంలో పలు జింకలు వీధి కుక్కల దాడికి గురై గాయపడుతున్నాయి. కంచ గచ్చిబౌలిలోని సర్వేనెంబర్ 25 లో గల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెట్లను తొలగించి భూమి చదును పనులు చేపట్టడంతో అందులో ఉన్న జింకలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల మధ్యకు వస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిపై అనేక సంవత్సరాల కోర్టు వివాదం గత కొంతకాలం క్రితం పరిష్కారమైన విషయం తెలిసిందే. కోర్టు వివాదం నుంచి బయటపడిన ఈ భూమిని ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించగా, మరోవైపు యూనివర్సిటీ భూమిని వేలం వేయడంపై విద్యార్థి లోకం ఉద్యమ బాట పట్టారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు 400 ఎకరాల భూమిలో ఉన్న జీవవైవిద్యాన్ని కాపాడాలని.. యూనివర్సిటీ భూములను భవిష్యత్తు అవసరాల కోసం యూనివర్సిటీకే అప్పగించాలని విద్యార్థులు పోరాటాలకు దిగారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కాగా అప్పటికే టీజీఐఐసి అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదుల కొద్ది జెసిబిలతో చెట్లను తొలగించి భూమి చదును పనులను చేపట్టింది. దీంతో సదరు భూమిలోని వృక్షాల మధ్య నివాసం ఉంటున్న జింకలు, నెమళ్లు యూనివర్సిటీకి పక్కనే ఉన్న ఇళ్ల వైపు వస్తున్నాయి.
జింకపై కుక్కల దాడి... తాజాగా శుక్రవారం సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లోకి ఓ జింక రాగా, అక్కడ ఉన్న వీధి కుక్కలు జింక మీద దాడి చేశాయి. ఈ దాడిలో జింక తీవ్రంగా గాయపడింది. జింక అరుపులతో సంఘటనస్థలికి చేరుకున్న విద్యార్థులు కుక్కలను తరిమివేసి యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది గాయపడిన జింకను చికిత్స నిమిత్తం జూపార్క్ ఆధ్వర్యంలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.
గోపన్ పల్లిలో ఇళ్ల మధ్య పరుగులు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి బయటపడిన మరో జింక యూనివర్సిటీకి పక్కనే ఉన్న గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ ఇళ్ల మధ్యకు చేరింది. మొదట ఓ దుకాణంలోకి దూరిన జింక భయంతో తచ్చాడడంతో దుకాణంలోని సామాగ్రి మొత్తం కింద పడిపోయింది. అక్కడి నుంచి బయటపడిన జింకను వీధి కుక్కలు వెంబడించాయి దీంతో ప్రాణభయంతో పరుగులు పెట్టిన జింక రాణి అనే మహిళ ఇంట్లోకి దూరింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ, జూ పార్క్ సిబ్బంది జింకను అతి కష్టం మీద పట్టుకున్నారు. మొదట మత్తుమందు ఇవ్వగా జింక స్పృహకోల్పోకపోవడంతో చివరికి వలవేసి జింకను పట్టుకొని జూపార్కుకు తరలించారు.
Admin
Ekaburu