Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : "మీకు హైటెక్ సిటీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్లాట్ ఉందా... అయితే జాగ్రత్త వడండి... మీ ఫ్లాట్ ఖాళీగా ఉంటే ఎప్పుడైనా ఏవరైనా సదరు స్థలం తమదంటూ రావచ్చు... నకిలీ డాక్యుమెంట్లతో మీ స్థలాన్ని ఎందరికో అమ్మి ఉండవచ్చు... లేదా మీ ప్లాట్ పేరుమీద నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి జిహెచ్ఎంసి నుంచి నిర్మాణ అనుమతులు పొందవచ్చు... హైటెక్ సిటీ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా తిమింగళాలు కబలిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలకు అసలే రక్షణ లేకుండా పోతుండగా ప్రైవేట్ స్థలాలను సైతం కబ్జాదారులు విడిచిపెట్టడం లేదు. ఖాళీగా స్థలం కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వేరొకరికి అమ్మడం జరిగిపోతుంది. అదీ కుదరకపోతే సదరు డాక్యుమెంట్లతో బ్యాంకుల్లో లోన్లు తీస్తున్నారు. ఈ విషయం మీరు వసిగట్టే సరికి జరుగాల్సింది జరిగిపోతుంది." గచ్చిబౌలిలోని ఇందిరానగర్ లో దశాబ్దాల క్రితం ప్లాటు కొనుగోలు చేసిన ఓ బాధితురాలి స్థలానికి పక్కనే ఉన్న జీవీ కాలనీ బై నెంబర్లతో డాక్యుమెంట్లను సృష్టించి కబ్జాకు యత్నించడం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ప్లాటు కబ్జాపై బాధితురాలు జిహెచ్ఎంసిని ఆశ్రయించడం సంచలనంగా మారింది. తీగ లాగితే డొంక కదిలినట్టు హుడా అనుమతి పొందిన జేవి కాలనీ లేఅవుట్లో ఖాళీ స్థలాలను కనిపించకుండా చేసిన కబ్జాదారులు.. పక్కనే ఉన్న ఇందిరా నగర్ ఖాళీ స్థలాలపై కన్నేశారు. బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాటి ఆధారంగా జిహెచ్ఎంసి నుంచి నిర్మాణ అనుమతులు సైతం పొందారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వేనెంబర్ 113/1, 113/2లో మొత్తం 16 ఎకరాల విస్తీర్ణంలో జేవీ కాలనీ లేఅవుట్ చేశారు. ఈ లేఅవుట్ కు 1990లో హుడా అనుమతి నెం.11272/MP2/HUDA/90 మంజూరయ్యింది.
బై నంబర్లతో ఖాళీ స్థలాల్లో పాగా... గత కొన్ని సంవత్సరాలుగా గచ్చిబౌలి పరిధిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను జేవీ కాలనీకి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలపై పడింది. హుడా అనుమతి ఉన్న జెవీ కాలనీ ప్లాట్ లకు బై నెంబర్లు వేసి యదేచ్చగా సదరు స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సహాయంతో జిహెచ్ఎంసి నుంచి నిర్మాణ అనుమతులు పొంది భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. హుడా లేఅవుట్ కు అక్రమ బై నెంబర్లతో రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు పొందుతూ జిహెచ్ఎంసి నుంచి ఎల్ఆర్ఎస్ రాయితీని సైతం పొందుతున్నారు. ఇప్పటికే అక్రమ బై నెంబర్లతో జేవీ కాలనీకి ఆనుకొని ఉన్న దాదాపు 5వేల గజాల స్థలం అన్యాక్రాంతం అయ్యినట్టు తెలుస్తోంది. హుడా అనుమతి పొందిన లేఔట్ లో బై నెంబర్ ప్లాట్లకు కళ్ళు మూసుకొని అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం, ఎల్ఆర్ఎస్ రాయితీ కల్పించడం విశేషం.
ఇందిరా నగర్ ప్లాట్లపై కన్నేసిన కబ్జాదారులు... అక్రమ బై నెంబర్లతో జె.వి కాలనీ లేఅవుట్ కు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను మొత్తం కనుమరుగు చేసిన కబ్జాదారులు తాజాగా ఈ కాలనీకి ఆనుకొని ఉన్న ఇందిరానగర్ ప్లాట్లపై కన్నేశారు. జె.వి కాలనీ లేఅవుట్ లోని ప్లాటుకు బై నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకున్న ఓ వ్యక్తి ఇందిరా నగర్ లోని మహిళ ప్లాటును కబ్జా చేసేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. గచ్చిబౌలి సర్వే నెంబర్ 97/A లోని ఇందిరా నగర్ ప్లాట్ నెంబర్ 18లో 236 గజాలను సవిత అనే మహిళ 1997లో కొనుగోలు చేసింది. సదరు స్థలానికి ఎల్అర్ఎస్ తీసుకొని, ఇంటి నెంబర్ 2-25/15 పొందింది. కాగా ఈ మధ్య కాలంలో కొంతమంది జేవీ కాలనీ ప్లాటు నెంబర్ 152కు బై నెంబర్ వేసి 152/A పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నిర్మాణ అనుమతులు పొంది ఆక్రమణకు యత్నించారు. ఈ విషయమై బాధిత మహిళ జిహెచ్ఎంసి కి ఫిర్యాదు చేసి హెచ్ఎండిఏ నుంచి జెవీ కాలనీ లేఅవుట్ నకలు తీసుకోగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జేవీ కాలనీ లేఅవుట్లో 152/A ప్లాటు లేకపోగా, కాలనీకి అనుకొని ఉన్న ఖాళీ స్థలాలు మొత్తం ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఈ మేరకు జేవీ కాలనీ లేఅవుట్, నిర్మాణ అనుమతులపై ఆధారాలతో జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసింది. నకిలీ ప్లాట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్లు చేసుకొని, నిర్మాణ అనుమతులు పొంది తన సొంత ప్లాట్ ను కబ్జా చేస్తున్నారని, వెంటనే అధికారులు ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
Ekaburu