Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. గతకొన్ని రోజులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతుండగా, ఎట్టకేలకు ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్టుగా తెలుస్తుంది. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రచారం సాగుతుండగా, ఎమ్మెల్యే గాంధీ మాత్రం ఇప్పటి వరకు తన పార్టీ మార్పుపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరికను నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ వర్గం బాహాటంగానే వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే జగదీశ్వర్ గౌడ్ అనుచరులు పలు సోషల్ మీడియా వేదికల మీద ఎమ్మెల్యే గాంధీ చేరికను విమర్శిస్తున్నారు.
Also Read : కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్ సీజ్
విందు రాజకీయం... కాగా ఎమ్మెల్యే గాంధీ చేరికను వ్యతిరేకిస్తున్న వర్గంతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. హైటెక్ సిటీలో ఓ హోటల్ లో జరిగిన విందులో ఇద్దరు నేతలతో పార్టీ అధిష్టానం చర్చించినట్టు సమాచారం. రానున్న కార్పొరేటర్ ఎన్నికల్లో ఇరువర్గాలకు చెరిసగం సీట్లు కేటాయించాలని చర్చ జరిగిందని, పునర్విభజన జరిగితే ఎమ్మెల్యే సీటు హామిపై సైతం చర్చ సాగిందనే సమాచారం అందుతుంది. కాగా పునర్విభజన జరిగితే ఓ కార్ల షో రూమ్ అధినేత పేరును ఓ వర్గం తెరమీదకు తేవడంతో అధిష్టానం ఈ చర్చను పక్కకు పెట్టినట్టు అనధికార సమాచారం.
ఫలించని ఎమ్మెల్సీ బుజ్జగింపు... కాగా ఎమ్మెల్యే గాంధీ పార్టీ మార్పుపై సమాచారం అందుకున్న బిఆర్ఎస్ అధిష్టానం గాంధీని బుజ్జగించేందుకు ఓ ఎమ్మెల్సీని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. శుక్రవారం గాంధీని కలిసిన సదరు ఎమ్మెల్సీ పార్టీ మారవద్దని సూచించగా, గాంధీ ససేమిరా అన్నట్లు సమాచారం. నియోజకవర్గం కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకుంటానని గాంధీ తేల్చి చెప్పడంతో ఎమ్మెల్సీ దౌత్యం ఫలించలేదని తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే గాంధీ పార్టీ మార్పు ఖాయమని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Admin
Ekaburu